#అమరావతి #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯
*అమరావతి.. కమ్మరావతి❗*
APRIL 3, 2026🎯
రాజ్యసభలో ఏపీ పునర్విభజన (సవరణ) బిల్లు-2026పై చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కులం కేంద్రంగా ఆమె చేసిన కామెంట్స్పై, ఆమె సామాజిక వర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలే అమరావతి అంటే కమ్మరావతి అనే విమర్శ వుందని, దాని నుంచి బయటికి రావాలని కోరుకుంటున్న తరుణంలో రేణుకాచౌదరి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయనే మాట వినిపిస్తోంది.
వైసీపీ హయాంలో మూడు రాజధానుల కాన్సెఫ్ట్ తెరపైకి వచ్చినప్పుడు, అమరావతి రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. అప్పట్లో అమరావతికి మద్దతుగా రేణుకా చౌదరి చేసిన హడావుడి అంతాఇంతా కాదు. తెలంగాణ కాంగ్రెస్
నాయకురాలైన రేణుకా చౌదరి, తానొక పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నానన్న సంగతి మరిచిపోయారు. ఒక సామాజిక వర్గానికి చెందిన అన్యాయంపై పోరాడుతున్నాననే స్పృహలోనే ఆమె ఉండిపోయారు.
రాజ్యసభలో అమరావతి బిల్లు సవరణపై కూడా తానొక కుల నాయకురాలిగానే మాట్లాడారన్న విమర్శ వెల్లువెత్తుతోంది. “నేను అప్పటి ముఖ్యమంత్రితో కూడా చెప్పాను. పెట్టరా పేరు అమరావతి. లేకపోతే పిలవరా పేరు కమ్మరావతి. పెట్టుపేరు అని నేనే అన్నాను”
అమరావతి కాదు, కమ్మరావతి అనే విమర్శలను ఆమె కొట్టి పారేయడానికి బదులు ఔను ఆ రకంగానే రాజధాని పేరు పెట్టండని అత్యున్నత చట్ట సభా వేదికగా డిమాండ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాధ్యత లేని రాజకీయ నాయకులు ఇట్లే
మాట్లాడ్తారనే విమర్శ వెల్లువెత్తుతోంది. రేణుకా చౌదరి నిత్యం సంచలనాల కోసం ఏదో ఒకటి మాట్లాడుతుంటారని పలువురు విమర్శిస్తున్నారు.
అమరావతిని కులం కోణంలో చూడకూడదని కోరుకునే వారికి రేణుకా చౌదరి రాజ్యసభలో ప్రసంగం ఏ మాత్రం నచ్చడం లేదు. ఇదేం రోగమని సొంత సామాజిక వర్గానికి చెందిన వారే ప్రశ్నిస్తున్నారు. దేశ అత్యున్నత చట్టసభలో కమ్మరావతి అని ప్రస్తావించాల్సిన అవసరం ఏంటని నిలదీస్తున్నారు. ఇదేమైనా కుల పంచాయితీనా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో అమరావతిపై కమ్మ కుల ముద్ర వేయడాన్ని తప్పు పట్టడాన్ని గుర్తు చేస్తున్నారు.
కానీ రాజకీయ సంచలనం, అలాగే మీడియా దృష్టిని ఆకర్షించేందుకు రాజ్యసభలో కమ్మరావతి అని పేరు పెట్టాలని అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అడిగినట్టు రేణుకా చౌదరి కాసింత గర్వంగా చెప్పుకోవడం విడ్డూరంగా వుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరైనా అమరావతిపై కమ్మరావతి అనే కుల ముద్ర వేస్తే ఖండించాల్సింది పోయి, కీలక పదవుల్లో వుంటూ చిల్లర మాటలు మాట్లాడ్డం తగదని హితవు చెబుతున్నారు.
అమరావతి కాదు, కమ్మరావతి అని పిలిపించుకోవడం వల్ల ఎక్కడో ఉన్న మీకు పోయేదేమీ లేదని, స్థానికులైన తాము తీవ్రంగా నష్టపోతామనే ఆవేదన ఆ సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి వ్యక్తమవుతోంది. అమరావతిలో కమ్మ వాళ్లతో పాటు అన్ని కులాలు, మతాల వారున్నారని మళ్లీమళ్లీ
చెప్పుకోవాల్సి వస్తోందని అంటున్నారు.
కమ్మవాళ్లంతా ధనవంతులు కాదని, నేటికీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూలిపనులు చేసుకుంటూ, రెక్కాడితే తప్ప డొక్కాడని కమ్మ వారు ఎంతో మంది ఉన్నారని అంటున్నారు. కమ్మ కులంలో ఐదారుగురు సంపన్నవంతులుంటే, లక్షలాది మంది పేదరికంతో మగ్గిపోయే వారున్నారన్నారు. రాజ్యసభలో రేణుకా చౌదరి కమ్మరావతి అని మాట్లాడ్డం ద్వారా, రాజధానిపై ఉన్న కులం ముద్ర నిజమే అని పార్లమెంట్ సభ్యులు నమ్మే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరు చివర్లో చౌదరి పేరు, అందుకు తగ్గట్టు మాటల్లో గర్వం... మొత్తం కులానికి చేటు తెచ్చేలా వుందనే ఆవేదన కమ్మవారి నుంచి వ్యక్తమవుతోంది.
ఇదే సందర్భంలో వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా అభిప్రాయం కూడా కులం కోణంలో వ్యక్తమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
“పార్లమెంట్ ఉభయసభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి నాది ఒక సూచన. మీరు కట్టేది అమరావతే తప్ప, కమ్మరావతి కాకుండా చూసుకోండి. తస్మాత్ జాగ్రత్త!” అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
అమరావతి కేవలం కమ్మవాళ్లకు సంబంధించిన రాజధాని అనే అభిప్రాయం కలిగిన వారెందరో ఉన్నారు. అందుకే విజయసాయిరెడ్డి లాంటి వారు మీరు కట్టేది అమరావతే
తప్ప, కమ్మరావతి కాకుండా చూసుకోండి. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. రేణుకా చౌదరి లాంటి వారి చేష్టలతో అమరావతి గురించి కుల రాజధాని అనుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే, వాళ్ల సామాజిక వర్గానికి చెందిన వారే ఆ మాట అంటున్నప్పుడు, ఇక మిగిలిన వారు అనుకోవడంలో తప్పేం వుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ఒక్కసారి బలమైన కుల ముద్ర పడితే, రానున్న రోజుల్లో ఆ సామాజిక వర్గంతో పాటు టీడీపీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు, ప్రమాదం ఏంటో తెలియకపోవచ్చు. పరిస్థితులు బాగాలేనప్పుడే సమస్య ఏంటో అనుభవంలోకి వస్తుంది.


