S.HariBlr (Bangalore)
688 views
#పురాణ గాథలు/కథలు #హిందూ పురాణ కథలు
*అచ్యుతమ్.!*
*నైమిశారణ్యములో ‘ద్వాదశ వార్షిక బ్రహ్మసత్రము’ అను దీర్ఘ సత్రయాగము జరుగుతోంది. ఆ యాగం జరుపుతున్న మహామునులు యాగ విరామ కాలంలో, ఏకాంతముగా ఏకాగ్ర మనస్సుతో కూర్చుని వున్న సూతుని సన్నిధి కి వెళ్లి*
*"అనఘా! మీరు మా కింతవరకు కొన్ని పురాణములు ప్రవచించారు. అవి అమృతోపమాయమైనవి. ఇంకా వినాలని మాకు వేడుకగ వుంది. భగవానుడు ఏ విధముగ ఏ కారణమున మత్స్యరూపమును ధరించి సృష్టి చేసాడు? ఇది అంతా మాకు చెప్ప వేడుచున్నాము" అని పలికారు.*
*ఆ మాటలు విన్న సూతుడిలా చెప్ప నారంభించాడు*
*“శౌనకాది మహామునులారా! బ్రాహ్మణోత్తములారా! సాక్షాత్ శ్రీ మహా విష్ణువే చెప్పిన మత్స్యపురాణము మీకు ఇప్పుడు చెప్పుచున్నాను వినుడు. ఇది బహు పుణ్యకరము. పవిత్రమైనది. ఆయువును వృద్ధి చేయునది. కనుక శ్రద్ధతో వినండి" అని మొదలు పెట్టాడు.*
*"పూర్వము మనువు అను రాజుండెడివాడు. ఇతడు సూర్యుని కుమారుడు. ఆయనకు ఆత్మ సంస్కారమునకు కావలసిన గుణములన్నియు కలవాడు. క్షమాగుణము కలవాడు. అతడు తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి మలయ పర్వతం మీద ఒక ప్రదేశంలో బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేసాడు.*
*వేల ఏండ్లు గడచిన తరువాత బ్రహ్మ ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని మనువుతో పలికాడు.*
*మనువు బ్రహ్మకు నమస్కరించి...*
*''అన్నిటికంటె ఉత్తమ మయిన ఒకే ఒక వరం నేను మిమ్ము వేడుచున్నాను. ప్రళయము సంభవించినప్పుడు స్థిరములు చరములునగు ప్రాణులను రక్షించుటకు నేను శక్తిగలవాడను కావలయును" అని అడిగాడు.*
*విశ్వమునకు ఆత్మరూపుడు అగు బ్రహ్మ ‘అట్లే కానిమ్మని’ పలికి అక్కడే అంతర్ధానం అయ్యాడు. దేవతలు పూలవాన కురిపించారు.*
*ఒకానొక రోజు మనువు తన ఆశ్రమంలో పితృతర్పణము చేస్తుండగా ఒక ఆడ చేప నీళ్లతో పాటు అతని రెండు చేతులలో పడింది. ఆ రాజుకు ఆ చేప రూపమును చూచి దయ కలిగి దానిని రక్షించాలని తన కమండలము లోని జలములలో వేసాడు.*
*ఆ మత్స్యము ఒక రాత్రిలో పన్నెండు అంగుళముల పొడవు పెరిగి తల పైకెత్తి మనువును చూచి...*
*"రక్షించుము రక్షించుము" అని పలికింది.*
*మనువు ఆ చేపను బయటకు తీసి వెడల్పైన మూతిగల మట్టిపాత్రలో వేసాడు. అక్కడ అది ఒక రాత్రిలో మూడు మూరలంతగా పెరిగింది. మరల ఆ చేప సహస్ర కిరణాత్మజుడగు మనువుతో అర్తనాదముతో*
*"నేను నిన్ను శరణు పొందితిని. రక్షించు రక్షించు" అంది.*
*ఆ రవినందనుడు దానిని బావిలో పడేసాడు. మర్నాటికి అది అక్కడ రెండు యోజనములంత (1600 మూరలు) పెద్దది అయ్యింది. మరల అది దీనముగా*
*"రక్షించు రక్షించు” అని ఆ రాజుతో పలికింది.*
*అతడు దానిని బావినుండి తీసి గంగా నదిలో వేయగా అది అచ్చటను అట్లే ఆ నది నిండుగా సరిపోవునంతగా పెరిగింది. అప్పుడా రాజు దానిని సముద్రములో పడేసాడు. వెంటనే అది సముద్రమంతటా వ్యాపించి కనబడింది. అది చూచి మనువు భయపడి*
*"ఎవరు నీవు? రాక్షస రాజువా? లేక వాసుదేవుడవా? అట్లు కానిచో నీవు ఈ విధముగా అతి తక్కువ కాలములోనే ఎట్లు నీ పరిమాణమును పెంచుకొనుచున్నావు? రెండు లక్షల యోజనములంత శరీరము ఎవ్వనికుండును? కేశవా! నీవు మత్స్యరూపుడవై నన్ను శ్రమపెట్టుచున్నావు. హృషీకేశా! జగన్నాథా! జగద్దమా! నీకు నమస్కారము” అన్నాడు.*
*మనువు ఇలా పలుకగానే మత్స్యరూపుడు అగు ఆభగవానుడు జనార్దనుడు*
*"బాగుబాగు! అనఘా! నీవు సత్యము గ్రహంచితివి. అచిరకాలముననే ఈ భూమి పర్వతములతోటి, మహా వనముల తోటి నీట మునుగును. ఇదిగో! ఈ నౌకను జీవ సమూహములను రక్షించుటకై నేను దేవతల సమూహము చేత నిర్మింపజేసితిని.*
*స్వేదజములు (చెమటనుండి పుట్టునవి), అండజములు, ఉద్భిజ్జములు, జరాయు జములు, ఉష్ణమునుండి పుట్టు దోమలు, గ్రుడ్ల నుండి పుట్టు పక్ష్యాదులు - నేలను చీల్చుకొని పుట్టు మొక్కలు చెట్లు, మావినుండి పుట్టు మనుష్యులు మొదలగు ప్రాణులు అన్నింటికి ఏ కీడును గలుగకుండ కాపాడుము.*
*ఈ ప్రళయ కాలము ముగిసిన తరువాత స్థిర చర రూపమయిన ఈ జగత్తున కంతటికి నీవు ప్రజాపతి వై కృతయుగారంభమున సర్వజ్ఞుడు భగవానుడు ఋషి మన్వంతరమునకు అధిపతి అయి నీవు దేవతలచేతను పూజింపబడెదవు" అన్నాడు.*
*"భగవాన్! ఎన్ని సంవత్సరముల తరువాత ప్రళయము సంభవించును? నేను ఆ ప్రాణులను ఎటుల రక్షింపగలను? తిరిగి నేను ఏవిధముగా నిన్ను కలియగలను?" అని మనువు భగవానుని ప్రశ్నించెను.*
*"ఇప్పటినుండి నూరుసంవత్సరముల వరకు కరువు ఏర్పడుతుంది. సూర్యుని కిరణాలు నిప్పులు ప్రసరిస్తాయి. బడబాగ్ని విజృంభిస్తుంది. మేఘాలు వర్షపు నీటితో భూమిని ముంచి వేస్తాయి. ఆసమయంలో నీవు ఈ నావను తీసుకొని, నా మత్స్యరూపుడనైన నా కొమ్ముకు కట్టినట్లయితే, నా ప్రభావం వలన ఈ నావలో ఉండే మునులు, మహర్షులు, సాధుజనులు, తదితర ప్రాణికోటి అంశములతో బాటు నీవు కూడా జీవించి ఉంటావు" అని చెప్పి భగవానుడు అంతర్ధానం అయ్యాడు.*
*ఆ విధంగా కృత యుగ ప్రారంభానికి ముందు జరిగే జల ప్రళయం నుండి మనువును సప్త ఋషులను పునః సృష్టికి కావలసిన అన్నింటిని మత్స్యరూపంలో భగవానుడు కాపాడాడు.*
*ఈ పోస్ట్ నచ్చితే షేర్ చేయండి.*
*┈┉━•❀꧁హరేకృష్ణ꧂❀•━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🚩🍁 🙏🕉️🙏 🍁🚩🍁
9 likes
10 shares