#ఎల్లో మీడియా.. 💥 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯
*విశ్వసనీయత కోల్పోయిన టీడీపీ మీడియా…బాబుకు భారీ నష్టం❗*
04.08.2026🎯
మీడియా, టీడీపీని వేర్వేరుగా చూడలేం. మరీ ముఖ్యంగా చంద్రబాబు చేతిలోకి అధికారం, టీడీపీ వచ్చాక…. మీడియాకు ప్రాధాన్యం పెరిగింది. మీడియాని అడ్డం పెట్టుకునే చంద్రబాబు సగానికి పైగా పనులు చక్కబెట్టారనే ఆరోపణలున్నాయి.
చంద్రబాబు మనసెరిగి, ఆయన ప్రత్యర్థులను మీడియానే టార్గెట్ చేస్తుంటుంది. అవి విపక్షమైనా, స్వపక్షమైనా సరే.
అంతెందుకు, 1995లో ఎన్టీఆర్ను గద్దె దించి, అధికారాన్ని చంద్రబాబు సొంతం చేసుకున్న తర్వాత మీడియా తీరు ఏ రీతిలో సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్, లక్ష్మిపార్వతిపై నీచాతి నీచ రాతలు, కార్టూన్లు వేసిన ఘన చరిత్ర… ఇదే టీడీపీ మీడియాకు దక్కుతుంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మీడియా పెద్దన్న పాత్ర పోషించే, ఆ పత్రిక ఎన్టీఆర్ను దిగంబరంగా చిత్రీకరించడం ఒక్కటే తక్కువ.
చంద్రబాబును వ్యతిరేకిస్తే, ఎన్టీఆర్ అయినా సరే వదిలిపెట్టేది లేదని సదరు అనుకూల మీడియా అనేక సందర్భాల్లో నిరూపించుకుంది.
ఎన్టీఆర్ చనిపోయాక, రాజకీయ అవసరాల రీత్యా, ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూల దండలు వేస్తూ, పూజలు చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది.
అయితే సోషల్ మీడియా రావడం, అలాగే టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియాని ఎదుర్కొని రాజకీయాలు చేయాలంటే, మనకు ఒక మీడియా వ్యవస్థ అవసరమని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. ఆ ఆలోచన, రాజకీయ అవసరాల నుంచి “సాక్షి” పుట్టింది. ఆ పత్రిక, చానెల్ ఏ మేరకు జగన్ రాజకీయ అవసరాలకు ఉపయోగపడుతున్నాయనేది వేరే చర్చ.
సోషల్ మీడియా విస్తృతి పుణ్యమా అని టీడీపీ అనుకూల మీడియా విశ్వసనీయత గాలిలో కొట్టుకుపోయింది. టీడీపీ మీడియా రాతల వెనుక దురుద్దేశాల్ని ఎండగట్టడంలో సోషల్ మీడియా పైచేయి సాధించింది.
అలాగే ఆ పత్రికల విశ్వసనీయతను సోషల్ మీడియా పూర్తిగా దెబ్బకొట్టిందనేందుకు తాజా ఉదాహరణలు చెప్పుకుందాం.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ పత్రిక చేపలకంచేరుకు చెందిన మైలిపల్లి ఎల్లాజీ పేరుతో ఒక అభిప్రాయాన్ని ప్రచురించింది. అయితే సదరు వ్యక్తి మూడేళ్ల క్రితం చనిపోయాడని, ఆయనకు జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి నివాళులర్పించే ఫొటోతో సహా సోషల్ మీడియా బయట పెట్టింది.
జీవించి లేని వ్యక్తి అభిప్రాయాన్ని కూడా టీడీపీ పత్రిక ప్రచురించడాన్ని బయట పెట్టడం ద్వారా, ఆ పత్రిక పాఠకులు సైతం అసహ్యించుకునే పరిస్థితి. ఇదే పత్రిక కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్లులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగితే, ఒక మహిళ వస్త్రాలను ప్రతిపక్ష పార్టీ వారు చించేసి, దుశ్శాసన పర్వానికి తెరలేపారంటూ గగ్గోలు పెడుతూ రాసింది.
కానీ నిజమేంటో సోషల్ మీడియా బయట పెట్టి, టీడీపీ పత్రిక రాతల్లోని డొల్లతనాన్ని, ప్రతిపక్ష పార్టీని బద్నాం చేయాలన్న కుట్రను బయటపెట్టడం గమనార్హం.
టీడీపీ కార్యకర్త నాగరాజు …పోలీసులు చూస్తుండగానే తన భార్య నైటీని చించేశాడు. ఆ నిందను వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, అలాగే కార్యకర్తలపై వేసి, రాజకీయంగా బద్నాం చేసేందుకు కుట్రపన్నాడని … వీడియో సాక్షిగా వాస్తవం బయట పడింది.
ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఆ పత్రిక మిన్నకుండిపోయింది. కానీ సోషల్ మీడియాలో సదరు వీడియోని షేర్ చేస్తూ, తప్పుడు రాతలు, అలాగే అక్రమ కేసు బనాయించడాన్ని తూర్పారపడుతున్నారు.
గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి, తీవ్రంగా కొట్టి, తిట్టి…గతంలో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో జరగని దుర్ఘటన చోటు చేసుకుంది. కానీ ఇదే టీడీపీ గెజిట్ పత్రికగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పత్రిక లోపలి పేజీల్లో చిన్న వార్తను ప్రచురించింది.
జనానికి తెలియకూడదని జాగ్రత్త పడింది. దీనికి కారణం… దుశ్శాసన పర్వానికి పాల్పడింది టీడీపీ నాయకుడు కావడమే. మరో అనుకూల పత్రిక అసలు ఆ సంఘటనే జరగనట్టు ఎలాంటి వార్త రాయకపోవడం గమనార్హం. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కువగా బద్నాం అయ్యిందెవరంటే, టీడీపీ మీడియానే అని చెప్పక తప్పదు.
ఆరాధించే నాయకుడి రాజకీయ ప్రయోజనాల కోసం 50 శాతం పని చేసినా, కనీసం ప్రజల తరపున మీడియా మిగిలిన 50 శాతం పని చేస్తుంటే, ఇవాళ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. జర్నలిజం నైతిక విలువల్ని పూర్తిగా వదిలేసి, కేవలం టీడీపీ, చంద్రబాబు ప్రయోజనాలు తప్ప, ప్రజల గోడు పట్టదనే రీతిలో సదరు మీడియా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఇందుకు ఎన్నైనా ఉదాహరణలు చెప్పొచ్చు.
ఇటీవల రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఏబీ వెంకటేశ్వరరావు, పీవీ సునీల్కుమార్లు… టీడీపీ అనుకూల మీడియా వికృత ధోరణులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారి ఎక్స్ ఖాతాల్లో పోస్టులు, వీడియోలను చూస్తే, కళ్లకు కట్టినట్టు చెప్పడాన్ని అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హీరోయిన్లతో సంబంధాలు అంటకట్టి, డిబేట్లను నిర్వహించిన నీచ చరిత్ర టీడీపీ మీడియాకే దక్కుతుంది. అందుకే వాటిని మీడియా హౌస్లుగా కాకుండా, కలేబ రాల నీ కేంద్రాలని మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి అభివర్ణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తే, కనీసం చిన్న ఫొటో, సింగిల్ కాలమ్ వార్తను క్యారీ చేయడానికి కూడా మనసురాలేదు. టీడీపీ మీడియా ధోరణి చూస్తే, ఒక విషయం గుర్తుకొస్తుంది.
వెనుకటికి ఒక కోడి పుంజు, తాను కూత కూయందే తెల్లవారదని అనుకునేదట. టీడీపీ మీడియా తీరు కూడా అట్లే వుంది. తాను రాయకపోతే , సమాజానికి ఏ సమాచారం తెలియదనే భ్రమలో వుంది. అలాగే తాను రాసిందే వార్త అనే మత్తులో వుంది. అలాంటి అభిప్రాయాలకు కాలం చెల్లిందని ఎంత త్వరగా గ్రహిస్తే, అంత మంచిది.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ మీడియా ఒంటెత్తు పోకడలతో జనం విసిగి పోయారు. తెలంగాణలో నేరుగా ఆ మీడియాకు హెచ్చరికలు చేస్తుండడాన్ని గమనించొచ్చు.
ఇటీవల ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద గోదీ మీడియాను జెన్ జీ తరం ఏ రకంగా అవహేళన చేసిందో చూశాం. గోదీ మీడియాకి మించి, తెలుగు సమాజంలో టీడీపీ మీడియా వ్యవహారాలున్నాయి. వైసీపీని గద్దె దించడం టీడీపీ కంటే తమపైనే ఎక్కువ బాధ్యత వున్నట్టు ఆ పార్టీ మీడియా వికృత రాతలు రాస్తోందన్న విమర్శ వుంది. చంద్రబాబు వ్యతిరేకిస్తే, బీజేపీ, మోదీ, అమిత్షాలపై విషం కక్కడాన్ని 2019కి ముందు చూశాం.
అయితే చంద్రబాబుపై అంధభక్తితో విశ్వసనీయతను కోల్పోయిన సంగతిని టీడీపీ మీడియా విస్మరించింది. ఇంకా సోషల్ మీడియా రాక ముందు వ్యవహారాల్నే కొనసాగిస్తోంది. అందుకే రోజురోజుకూ సదరు మీడియా అభాసుపాలవుతోంది. ఈ కారణంగానే జనాలు పట్టించుకోని పరిస్థితి. వ్యక్తిత్వం, గౌరవం లేని వారికి సమాజంలో విలువ ఉండనట్టే, విశ్వసనీయత కోల్పోయిన మీడియాగా తమ రాతలకు అలాంటి స్థానమే వుంటుందని గుర్తిస్తే మంచిది. ఇప్పుడీ మీడియా తప్పులన్నీ టీడీపీకి భారంగా మారాయనే చర్చకు తెరలేచింది.