*_ఆనంద్ బక్షి ._*
*(బక్షి ఆనంద్ ప్రకాష్ వైద్) ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న రావల్పిండిలో 1930, జూలై 21న జన్మించాడు. ఇతని పూర్వీకులు రావల్పిండి సమీపంలో ఉన్న కుర్రీ గ్రామానికి చెందిన మోహ్యాల్ బ్రాహ్మణులు. వీరి మూలాలు కాశ్మీర్లో ఉన్నాయి. ఇతడు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇతని తల్లి సుమిత్ర మరణించింది. విభజన సమయంలో ఇతని కుటుంబం పూనే, మీరట్ల గుండా ప్రయాణించి ఢిల్లీకి వలస వచ్చింది అక్కడ స్థిరపడింది.*
*ఇతని ప్రాథమిక విద్య అనంతరం ఇతడు భారతీయ సైన్యంలో చేరాడు. ఇతనికి చిన్నతనం నుండే కవిత్వం వ్రాయాలని ఉబలాటం ఉండేది. అయితే సైన్యంలో ఇతనికి సమయం దొరకక ఎక్కువగా వ్రాయడానికి కుదరలేదు. సమయం చిక్కినప్పుడల్లా ఇతడు కవిత్వం వ్రాసేవాడు. తన పాటలను సైన్యంలో స్థానిక కార్యక్రమాలలో ఉపయోగించేవాడు. సైన్యంలో ఇతడు ఎక్కువ కాలం పనిచేశాడు*.
*ఇతడు హిందీ సినిమాలలో రచయితగా, గాయకుడిగా పేరు తెచ్చుకోవాలని ప్రవేశించాడు. కానీ చివరకు గేయ రచయితగా రాణించాడు*. *బ్రిజ్మోహన్ సినిమా భలా ఆద్మీ (1958) చిత్రంతో ఇతనికి గీతరచయితగా గుర్తింపు వచ్చింది. 1956 నుండి 1962 వరకు కొన్ని చిత్రాలకు పనిచేసినా 1962లో మెహెందీ లగీ మేరీ హాత్తో ఇతని విజయ పరంపర ప్రారంభమయ్యింది. ఇతడు మొత్తం 638 హిందీ సినిమాలకు 3500లకు పైగా పాటలను వ్రాశాడు*. *ఇతని పాటలకు లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఆర్.డి.బర్మన్, కళ్యాణ్జీ ఆనంద్జీ, ఎస్.డి.బర్మన్, అను మాలిక్, రాజేష్ రోషన్, ఆనంద్-మిలింద్ మొదలైన సంగీత దర్శకులు బాణీలు కూర్చగా, షంషాద్ బేగం, ఇలా అరుణ్, ఖుర్షీద్ బావ్రా, అమీర్బాయి కర్ణాటకి, సుధా మల్హోత్రా, కిశోర్ కుమార్, శైలేంద్ర సింగ్, కుమార్ సానూ, కవితా కృష్ణమూర్తి వంటి అనేక మంది గాయనీ గాయకులు ఇతని పాటలను ఆలపించారు*.
*ఇతడు వ్రాసిన పాటలలో 1972లో వచ్చిన హరేరామ హరేకృష్ణ చిత్రంలోని దమ్ మారో దమ్ పాట ఇతడిని ప్రతిభావంతుడైన రచయితగా* *నిలబెట్టింది. ఇతడు గీతరచన చేసిన చిత్రాలలో బాబీ, అమర్ ప్రేమ్, ఆరాధన, జీనే కీ రాహ్, మేరా గావ్ మేరా దేశ్, ఆయే దిన్ బహార్ కే, ఆయా సావన్ ఝూమ్కే, సీతా ఔర్ గీతా, షోలే, ధరమ్ వీర్, నగీనా, లమ్హే, హమ్, మొహ్రా, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, పర్దేశ్, దుష్మన్, తాళ్, మొహబ్బతే, గదర్:ఏక్ ప్రేమ్ కథ, యాదే వంటి అనేక విజయవంతమైన చిత్రాలున్నాయి.*
*ఇతడు ఉత్తమ గేయ రచయితగా ఫిల్మ్ఫేర్ పురస్కారానికై 40 సార్లు నామినేట్ చేయబడ్డాడు.* *వాటిలో 4 పర్యాయాలు ఉత్తమ గేయరచయితగా ఫిల్మ్ఫేర్ పురస్కారం దక్కించుకున్నాడు.*
*ఇతడు తన జీవితంలో విపరీతంగా ధూమపానం చేయడం వల్ల ఇతని ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడ్డాడు.* *పర్యవసానంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 2002, మార్చి 30వ తేదీన తన 71వ యేట మరణించాడు. మరణించేనాటికి ఇతనికి భార్య కమలా మోహన్ బక్షి, కుమార్తెలు సుమన్ దత్, కవితా బాలి, కుమారులు రాజేష్ బక్షి, రాకేష్ బక్షి ఉన్నారు. ఇతడు రచించిన పాటలున్న చివరి సినిమా మెహబూబా ఇతని మరణానంతరం విడుదలయ్యింది.* #మన సంప్రదాయాలు సమాచారం